జనం పవర్,మంథని ఆగస్టు 20:
మంథని ఎస్ఎల్బి ఫంక్షన్ హాల్లో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కండరాల క్షీణత బాధితుల పెన్షన్ల పెంపు కోసం జరిగిన సన్నాహక సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వం, ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. పెన్షన్ పెంపు హామీని నిలబెట్టుకోలేని రేవంత్ ప్రభుత్వం చేతగానిదని, ప్రజా సమస్యలపై గట్టిగా ప్రశ్నించని కేసీఆర్ ప్రతిపక్ష హోదాకు పనికిరాని నాయకుడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మోసం కారణంగా ఒక్కో పెన్షన్దారునికి 20 నెలలుగా సుమారు 40 వేల రూపాయల నష్టం జరిగిందని, ఇప్పటికే 50 లక్షల మందికి పెన్షన్లు అందలేదని మండిపడ్డారు. చంద్రబాబు కాలంలో పెన్షన్ పెంపు సాధ్యమైనా, ఇప్పుడేమో హామీలు వంచనలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్లో జరగనున్న విశ్వరూప గర్జన సభలో పెన్షన్దారులంతా భారీగా తరలివచ్చి పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, ఈ సభతో పెన్షన్లు పెరుగుతాయా లేక రేవంత్ గద్దె దిగుతాడా అన్నది తేలుతుందని హెచ్చరించారు.









