మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 16:
వాతావరణ శాఖ సూచన, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజారక్షణ విషయంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 24 నుండి 36 గంటలు భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్, ఆదివారం ఆరెంజ్ అలర్ట్ ఉందని, ప్రజారక్షణ దిశగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 15.6 టి.ఎం.సి. నీరు ఉండని, ఎస్.ఆర్.ఎస్.పి., కడెం ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతుందని, ప్రాజెక్టులో 17 టి.ఎం.సి. నీటిమట్టం దాటితే ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. టామ్ టామ్ ద్వారా నది పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లకుండా, వాగు, నది దాటకూడదని ప్రజలకు తెలియపరచడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసించే వారిని వెంటనే తరలించాలని, వాగులు, నదులు ఉదృతంగా ప్రవహించే సమయంలో ప్రజలను, వాహనదారులను అటువైపుగా వెళ్లకుండా సిబ్బందితో కొండగట్టు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రహదారులు, కల్వర్టులు దెబ్బతింటే ఆ ప్రాంతంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వైద్య సిబ్బంది వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజల తక్షణ సహాయం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736- 250501 ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. జిల్లాలో 90 మంది సభ్యులతో కూడిన 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, రక్షణ పరికరాలతో తక్షణ సహాయం కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లో లెవెల్ కాజ్ వేల వద్ద ప్రజలు వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అప్రమత్తత చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.









