జనం పవర్, భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31:
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, స్కీం కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం నెలకు 26వేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 7న హైదరాబాదులో జరిగే ఐ ఎఫ్ టి యు సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.సీతారామయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెం ఐఎఫ్టియు కార్యాలయంలో సదస్సు ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్మికులకు ఉద్యోగ ఉపాధి భద్రత పని స్థలాల్లో రక్షణ సమానపనికి సమాన వేతనం 8గంటల పని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులతో పాటు ఆశ అంగన్వాడి
మిడ్ డే మీల్స్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీ కార్మికులతో ప్రభుత్వాలు వెట్టి చాకిరి చేయిస్తూ శ్రమ దోపిడికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
ఈ సమస్యల పరిష్కారానికై 7న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు సదస్సుకు వివిధ రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు ఏరియా అధ్యక్ష కార్యదర్శులు మోత్కూరి మల్లికార్జున రావు, ఎన్ సంజీవ్, శరత్, అవినాష్, రాధ, కృష్ణ, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.









