జనం పవర్,మంథని, ఆగస్టు 16:
మంథని పోలీసుల ఆధ్వర్యంలో మంథని మండలంలోని విలోచవరం గ్రామంలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని, కుటుంబాలను సమస్యల్లోకి నెడుతుందని స్పష్టం చేశారు. సమాజం నుంచి మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ప్రజలు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా, వాడుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అలా చేస్తే చట్టపరమైన రక్షణ కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పర్యవేక్షణ వహించాలని సూచించారు. గ్రామస్థులు సదస్సులో చురుకుగా పాల్గొని మత్తు వ్యసనాలపై నియంత్రణ చర్యలకు మద్దతు ప్రకటించారు.









