కరీంనగర్, జనం పవర్ ఆగస్టు 15 :
కరీంనగర్ జిల్లా భూగర్భ జలశాఖ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా భూగర్భ జలశాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగరవేసి, జెండాకు గౌరవ వందనం చేసి స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించారు. అనంతరం భూగర్భజల శాఖ అధికారి మాట్లాడుతూ, “ఎందరో మహానుభావుల త్యాగం, నిరంతర పోరాట ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించింది. వారి కృషి వల్లనే నేడు మనం స్వేచ్ఛా గాలిని పీలుస్తూ, మన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరుచుకునే అవకాశం పొందుతున్నాం. ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత” అని తెలిపారు. అలాగే స్వాతంత్ర్యం అంటే కేవలం జెండా ఎగరవేయడం మాత్రమే కాక, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, దేశాన్ని నశింపజేసే అలవాట్లు, అన్యాయాలను దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.









