జనంపవర్, గంగాధర | నవంబర్ 10 :
గంగాధర పోలీస్ స్టేషన్లో సీఐ ఏ. ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. చొప్పదండి సర్కిల్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ నేరచరిత్ర కలిగిన వ్యక్తులను సమీక్షించి, ఇటీవల వారి ప్రవర్తన, కార్యకలాపాలపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “ఇకపై ఎటువంటి చట్టవ్యతిరేక చర్యల్లో పాల్గొనకండి. చట్టపరమైన మార్గంలో ముందుకు సాగి, సమాజంలో సత్ప్రవర్తనతో మంచి పౌరులుగా ఎదగండి. మీరు పోలీస్ శాఖ పర్యవేక్షణలో ఉన్నారు. మళ్లీ క్రైమ్ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
సమాజం, కుటుంబం అభివృద్ధికి దోహదపడే మార్గంలో నడవాలని సూచిస్తూ, “జీవితం ఒక్కసారే వస్తుంది — దాన్ని చెడువైపు కాకుండా మంచివైపు మలచుకోండి” అని సీఐ సూచించారు.
ఈ కార్యక్రమంలో గంగాధర ఎస్ఐ బి. వంశీ కృష్ణ, సిబ్బంది మరియు స్థానిక పోలీసులు పాల్గొన్నారు.









