• వరస ఆత్మహత్యలకు కారణాలు ఏమిటి?
• కులవివక్ష, మానసిక వేధింపు లేనా?
• దేశవ్యాప్తం గా కలకలం సృష్టించిన ఘటన
జనం పవర్, హైదరాబాద్ :
హర్యానా పోలీసు శాఖలో ఇటీవల జరిగిన రెండు ఆత్మహత్యలు రాష్ట్ర వ్యవస్థలోని లోతైన సమస్యలను బట్టబయలు చేస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ బలవన్మరణం తర్వాత, ఇప్పుడు ఏఎస్సై సందీప్ కుమార్ కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఈ సంఘటనలు కేవలం వ్యక్తిగత దుర్ఘటనలు కాకుండా, పోలీసు వ్యవస్థలోని కుల వివక్ష, అవినీతి, మానసిక వేధింపులు వంటి దీర్ఘకాలిక సమస్యలను సూచిస్తున్నాయి. పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు అక్టోబర్ 7న చండీగఢ్ లోని తన నివాసంలో రివా ల్వర్ తో కాల్చుకుని మరణించిన పూరన్ కుమార్ (52, 2001 బ్యాచ్ ఐపీఎస్), తన సూసైడ్ నోట్లో 8-10 మంది సీనియర్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. డీజీపీ శత్రుజీత్ కపూర్, మాజీ రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా సహా పలువురిని కుల ఆధారిత వివక్ష, వేధింపులు, అవమానాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పూరన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. ఈ ఆరోపణలతో చండీగఢ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు దాఖలు చేశారు. దీంతో హర్యానా ప్రభుత్వం డీజీపీని సెలవుపై పంపించి, ఎస్పీని బదిలీ చేసింది. అయితే, పూరన్ మరణంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే, ఆయనపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రోహ్ తక్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో ఐజీగా పనిచేసిన పూరన్పై
లంచం కేసు నడుస్తోంది. ఆయన గన్మన్ సుశీల్ కుమార్ తో సంబంధం ఉన్న ఈ కేసులో ఏఎస్సై సందీప్ కుమార్ దర్యాప్తు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.









