జనం పవర్, వనపర్తి, సెస్టెంబర్ 5 :
గురువారం మధ్య రాత్రి 1గంట సమయంలో పెబ్బేరు మండలం సుచి రెస్టారెంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వనపర్తి మండలం నాచహల్లి గ్రామానికి చెందిన శివశంకర్ తండ్రి గోవింద్,
సాయి తండ్రి శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి.శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి జిల్లా ఆస్పత్రిలో మృతిచెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.
వినాయక నిమజ్జన సందర్భంగా నాచహల్లి గ్రామ యువకులు వినాయకుడిని బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో నిమజ్జనం చేసి వస్తున్న సందర్భంలో పెబ్బేరు మండలం సుచిదాబ వద్ద వేగంగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డా రని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉందని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు వివరించారు.ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పరామర్శలో వనపర్తి మండల మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, పట్టణ ప్రముఖ వైద్యుడు పగిడాల శ్రీనివాస్, పట్టణ మాజీ కౌన్సిలర్ బ్రహ్మంచారి, ఉమల్ల రాములు తదితరులు ఉన్నారు.









