*జనం పవర్,హుజురాబాద్ సెప్టెంబర్05*
నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ, పేద, రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడం పట్ల బిజెపి శ్రేణులు సంబరాలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాలు చేపట్టి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. హుజురాబాద్ బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన ప్రధాని మోదీ చిత్రపట పాలాభిషేకం కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తీసుకుని ముందుకెళ్తోందన్నారు. తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతీ పేద, మధ్యతరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూరబోతుందని తెలిపారు. దినసరి అవసరాల వస్తువులు, గృహ వినియోగ వస్తువులపై ధరలు తగ్గడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గనుందని, పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతి అన్నారు.
కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు, పెరిగిన పన్నుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మోదీ జీఎస్టీ సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయన్నారు.. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.









